జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ
జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ
పోలీసులు సంయమనం పాటించాలి!
పండుగనాడు భయభ్రాంతులకు గురి చేయడం తగదు!
తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి!
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్
సంగారెడ్డి:
ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను పోలీసులు అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే(ఐజేయు) తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్,
జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నేరస్తుల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం పత్రికా స్వేచ్ఛను నొక్కివేయడమే అని వారు అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధ మని పేర్కొన్నారు.
జర్నలిస్టులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి తగదు. అని అన్నారు.ఏదైనా అంశంపై వివరణ కోరాల్సి ఉంటే చట్టబద్ధమైన పద్ధతుల్లో నోటీసులు ఇవ్వాలి తప్ప, ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు అని ఖండించారు.అక్రమంగా అదుపులోకి తీసుకున్న దొంతు రమేష్, చారి, మరియు సుధీర్ లను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల మాదిరిగా అర్ధరాత్రి ..అది కూడా పండుగనాడు అదుపులోకి తీసుకోవడం తగదు అని వారరు పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను క్షోభకు గురి చేయడం మంచిది కాదన్నారు.
జర్నలిస్టుల హక్కుల కోసం, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం తమ యూనియన్ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నేతలు స్పష్టం చేశారు.
పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.

Comments
Post a Comment