*అనలైజర్ల ట్యాంపరింగ్కు చెక్ పెట్టేందుకు టీజీపీసీబీ ప్రత్యేక వర్క్షాప్*
*అనలైజర్ల ట్యాంపరింగ్కు చెక్ పెట్టేందుకు టీజీపీసీబీ ప్రత్యేక వర్క్షాప్*
*హైదరాబాద్:* పరిశ్రమలు తమ కాలుష్య ఉద్గారాల వివరాలను దాచేందుకు ఆన్లైన్ అనలైజర్లలో చేస్తున్న ట్యాంపరింగ్ను అరికట్టేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఇందులో భాగంగా పరిశ్రమలు మరియు నియంత్రణ సంస్థలకు సాంకేతిక పరిష్కారాలు అనే అంశంపై సనత్నగర్లోని ప్రధాన కార్యాలయంలో బుధవారం ఒకరోజు సామర్థ్య నిర్మాణ కార్యశాలను నిర్వహించింది.
ఆన్లైన్ పర్యవేక్షణ వ్యవస్థల నిపుణుడు డా. ఎస్. సురేష్ కుమార్ ఈ వర్క్షాప్లో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నిరంతర ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థలు, ఆన్లైన్ వ్యర్థ జల పర్యవేక్షణ, నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, వాయు కాలుష్య నియంత్రణ పరికరాల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలో ఆయన వివరించారు. అనలైజర్ల క్యాలిబ్రేషన్, సర్టిఫికేషన్ ప్రమాణాలు, వాటి రకాలు, సీఈఎంఎస్లో వాటి స్థానం, ఎంత తరచుగా క్యాలిబ్రేషన్ చేయాలనే అంశాలతో పాటు పరిశ్రమలు ఎలాంటి పద్ధతుల్లో ట్యాంపరింగ్కు పాల్పడుతున్నాయి, ఆ డేటా మోసాలను ధ్రువీకరణ ద్వారా ఎలా పట్టుకోవాలో సోదాహరణంగా తెలిపారు. ముఖ్యంగా అధిక కాలుష్యం విడుదల చేసే సిమెంట్, థర్మల్ విద్యుత్, ఫార్మా పరిశ్రమలకు సంబంధించిన కేస్ స్టడీలను విశ్లేషించి అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి జి. రవి, ఐఏఎస్ మాట్లాడుతూ పరిశ్రమల తనిఖీల సమయంలో కేవలం పరిశ్రమను పరిశీలించడమే కాకుండా ఆన్లైన్ పర్యవేక్షణ వ్యవస్థల మూల్యాంకనం, సీఈఎంఎస్ స్థితిని క్షుణ్ణంగా ధ్రువీకరించడం చాలా అవసరమని అన్నారు. ఈ వర్క్షాప్ సాంకేతిక, శాస్త్రీయ అధికారులకు ఫీల్డ్ స్థాయిలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యశాలకు బోర్డు ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్, ప్రాంతీయ కార్యాలయాల నుండి సాంకేతిక, శాస్త్రీయ అధికారులు హాజరయ్యారు.
_- గుడాచారి.పేజ్_

Comments
Post a Comment