రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
![]() |
*రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ*
*ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం*
*మారుతున్న కాలానికి అనుగుణంగా పనితీరు మారాలి*
*జిల్లా ప్రజా సంబంధాల అధికారుల వర్క్షాపులో*
*మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
*హైదరాబాద్*: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, రెండేళ్ల పాలనలోనే తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచారో, ఆ మార్పును కేవలం రెండేళ్లలోనే ప్రజల కళ్ల ముందే నిలబెట్టామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు.
తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లిలోని మీడియా అకాడమీలో జిల్లా ప్రజా సంబంధాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన పునశ్చరణ తరగతులకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మేం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ సంక్షోభం నుంచి బయటపడి, అభివృద్ధి–సంక్షేమాలను పరుగులు పెట్టిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదవాడికి అండగా నిలిచామని తెలిపారు.
వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి ప్రతి రంగంలో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్నాయని అన్నారు.
అయితే, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి చేరడం లేదని అన్నారు. ప్రజలకూ ప్రభుత్వానికీ వారధిగా ఉండాల్సిన ప్రజా సంబంధాల అధికారుల పాత్ర మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రస్తుత మీడియా మార్పులకు అనుగుణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియాను ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి శక్తివంతమైన సాధనంగా వినియోగించాలని అన్నారు.
క్షేత్రస్థాయికి వెళ్లి విజయవంతంగా అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని ప్రజలకు చేరేలా సృజనాత్మక ప్రచారం చేయాలని ఆదేశించారు.
ప్రతి జిల్లాకు సమర్థవంతమైన డీపీఆర్వోల నియమించాలని, ఇతర విభాగాలలో ఉన్నవారి డిప్యూటేషన్లను రద్దు చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఐ&పీఆర్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి,ఐడిసీ ఛైర్మన్ మువ్వ విజయబాబు, ఐ&పీఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment