**అమరావతి మందడంలో ఉద్రిక్తత... మహిళల అరెస్ట్**

అమరావతి మందడంలో ఉద్రిక్తత... మహిళల అరెస్ట్


ఓవైపు ఏలూరులో సీఎం జగన్... రాజధాని తరలింపునకు అనుకూలంగా సంకేతాలిస్తూ... ప్రకటన చెయ్యడంతో... అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి.


 ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇవాళ్టి నుంచీ సకల జనుల సమ్మెకు దిగారు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, ప్రజలు. తమకు న్యాయం జరగాల్సిందే అంటూ... తమ ఆందోళనలను పెంచుతూ... మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో... మందడంలో... మహిళల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కొంత మంది మహిళల్ని అరెస్టు చేశామంటున్నారు పోలీసులు. మరోవైపు రాజధానిని తరలించే అంశంపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాల్ని సరిదిద్దుతామన్నారు. తద్వారా రాజధానిని తరలించబోతున్నట్లు మరోసారి సంకేతాలిచ్చినట్లైంది. ఈ వార్త తెలిసిన తర్వాత... అమరావతి రైతులు... సకల జనుల సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. 16 రోజులుగా చేస్తున్న తమ ఆందోళనలను సీఎం జగన్ పట్టించుకోవట్లేదనీ... తామేంటో చూపిస్తామని అంటున్నారు. మొత్తంగా అమరావతి రైతులు ఎంతగా ఆందోళనలు చేస్తున్నా... ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.


Comments