ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం
హైద్రాబాద్, గూఢచారి డెస్క్:
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు కౌటికే విఠల్ను సంస్థ గ్లోబల్ చైర్మన్ టీ.జీ. వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన టీ.జీ. వెంకటేష్, కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారులలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. తమ పాలసీదారుల జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వెయ్యిమందికి ఉచిత అన్నదానం నిర్వహించడం, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, ఎండాకాలంలో వేలాది మందికి ఉచితంగా నీటి బాటిళ్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజపట్ల అంకితభావాన్ని గుర్తించి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా నియమించినట్లు తెలిపారు.
అనంతరం కౌటికే విఠల్ మాట్లాడుతూ, తాను ప్రపంచ ఆర్య వైశ్య మహాసభలో చేరి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. మొదటి రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అనంతరం నాలుగు సంవత్సరాలు జాతీయ సలహాదారుగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను, అలాగే జాతీయ సలహాదారుగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు.
సభకు అధ్యక్షత వహించిన అడ్వకేట్ మడుపల్లి రవి గుప్త మాట్లాడుతూ, కౌటికే విఠల్ పట్టుదల, కార్యదక్షతకు ప్రతీక అని అన్నారు. ఏ బాధ్యత చేపట్టినా సంపూర్ణ నిబద్ధతతో నిర్వహిస్తారని కొనియాడారు. గౌరవ అతిథిగా హాజరైన భారతీయ జీవిత బీమా సంస్థ సీనియర్ మోస్ట్ ఏజెంట్ మరియు ఏజెంట్ల నాయకుడు బి.ఎన్. చారి మాట్లాడుతూ, కౌటికే విఠల్ ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రతి సంవత్సరం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారని అభినందించారు. తమ మధ్యనే ఉంటూ ఎన్నో వినూత్న వ్యాపార పద్ధతులు, విజయాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తికి ఏ పదవి అప్పగించినా పూర్తి న్యాయం చేస్తారని, గ్లోబల్ సలహాదారుగా నియమించడం సంస్థ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
చివరగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కౌటికే విఠల్ కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ చైర్మన్ టీ.జీ. వెంకటేష్ అందరికీ సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని టీ.జీ. వెంకటేష్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.

Comments
Post a Comment