తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్
తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి
* ఏపీ మంత్రి టీజీ భరత్
హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. 2014 నుంచి తెలంగాణలో వైశ్యులకు మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. జనాభా లో దాదాపు 5 శాతం ఉన్న ఆర్య వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వైశ్యులు ఐకమత్యంతో ఉండి శక్తి చాటితేనే గౌరవం దక్కుతుందన్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు.
అందరు వైశ్యులు కూడా పేరు చివరన గుప్త అని పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేది ఆర్య వైశ్యులేనన్నారు. అందరూ గోసేవ కూడా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోసేవ చేసిన ఫలితం గానే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. వాసవీ పారాయణ మహోత్సవాన్ని తలపెట్టిన కల్వ సుజాత గుప్తను ఆయన అభినందించారు.

Comments
Post a Comment