రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పరార్.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు
రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పరార్.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు
మల్కాజిగిరి, కుషాయిగూడ భగవాన్ కాలనీకి చెందిన పబ్బా చంద్రశేఖర్ (50)పై సుమారు 80 మంది బాధితులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వివిధ కారణాలు చూపిస్తూ, అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి, వ్యక్తిగత రుణాల పేరుతో మొత్తం రూ.50 కోట్లకు పైగా సేకరించి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ప్రకారం, పబ్బా చంద్రశేఖర్ గత 30 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్గా వ్యాపారం నిర్వహించడమే కాకుండా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ (AIVF) ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. తన కుమార్తె వివాహం, తండ్రి వైద్యం, ఇల్లు నిర్మాణం, సిమెంట్ కంపెనీల ప్రత్యేక పథకాలు, జీఎస్టీ చెల్లిస్తే భారీ మొత్తం విడుదల అవుతుందని వంటి వివిధ కారణాలు చూపించి పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు.
జూన్ 22 నుంచి ఆయన మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండగా, భార్యతో కలిసి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. వెళ్లే ముందు ఇద్దరు కుమార్తెలను తన తమ్ముడి ఇంట్లో వదిలి వెళ్లారని, స్విట్జర్లాండ్కు వెళ్లారని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
పబ్బా చంద్రశేఖర్ మాటలు నమ్మి కొందరు తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బును, మరికొందరు అప్పులు చేసి కూడా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన రెండు మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో లేవని తెలిపారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను కోరారు.

Comments
Post a Comment