*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం*
*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం*
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో “జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి బాటిల్స్ పంపిణీ సేవా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మహాసభ ముఖ్య సలహాదారు బండారు సుబ్బారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం కింద తొలి దశలో 20,000 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేయబడుతున్నాయి. ఎండాకాలం ముగిసేంతవరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అఖిల భారత నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ స్పాన్సర్గా ముందుకు రావడం విశేషం.
ఈ సందర్భంగా కౌటికె విఠల్ మాట్లాడుతూ, “విపరీతమైన ఎండల్లో దాహార్తిని తీర్చడం అత్యంత మానవీయమైన సేవ. ఆహారం లేకపోయినా కొంతకాలం బ్రతకవచ్చు, కానీ నీరు లేకుండా జీవించడం అసాధ్యం. అందుకే ఈ కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా మద్దతు అందిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చేపట్టే ప్రతి సేవా కార్యక్రమంలో తాను సక్రియంగా పాల్గొంటానని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రం – హైదరాబాద్ *'తిరుమల గ్రూప్'* తమ తొలి సేవా కార్యక్రమంగా గర్వంగా నిర్వహిస్తోంది. ప్రతినెల ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గ్రూప్ నాయకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మహాసభ నాయకులు చకిలం రమణయ్య మాట్లాడుతూ, “మహాసభ నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమంలో 'తిరుమల గ్రూప్' ముందుండి సేవ చేయడానికి కట్టుబడి ఉంది” అని తెలిపారు.
ముఖ్య అతిథిగా హాజరైన బండారు సుబ్బారావు మాట్లాడుతూ, “ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం సమాజానికి ఎంతో అవసరమైనది మరియు ఆదర్శప్రాయమైనది. ఇందులో భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు నా పూర్తి మద్దతు ఉంటుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో WAM హైదరాబాద్ 'తిరుమల గ్రూప్' సభ్యులు, మహాసభ సీనియర్ నాయకులు చకిలం రమణయ్య , సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింగిరికొండ నరసింహ , కొండూరి శ్రీనివాస్ , శ్రీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
వైశ్య కులదేవత శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా, రేపు సికింద్రాబాద్లో జరగనున్న ప్రత్యేక ఊరేగింపులో భాగంగా కూడా ఈ ఉచిత నీటి పంపిణీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు 'తిరుమల గ్రూప్' సభ్యులు తెలిపారు.

Comments
Post a Comment